లివ్ ఇన్ పార్ట్ నర్ ను చంపేసి బెడ్ కింద దాచిన వ్యక్తి.. ఫరీదాబాద్‌ లో ఘోరం

  • ఎలుక చనిపోయిందని ఇంటి ఓనర్ ను నమ్మించిన హంతకుడు
  • రెండు రోజుల తర్వాత పరార్.. నానమ్మకు విషయం చెప్పిడంతో బయటపడ్డ దారుణం
  • నిందితుడు జితేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు
ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను గొంతు నులిమి హత్య చేశాడో వ్యక్తి.. ఆపై మృతదేహాన్ని మంచం కింద దాచి రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రాకుండా అగరుబత్తులు వెలిగించాడు. గదిలో ఎలుక చనిపోయిందని, అందుకే అగరుబత్తీలు వెలిగిస్తున్నానని ఇంటి ఓనర్ ను నమ్మించాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో రెండు రోజుల తర్వాత పరారయ్యాడు. తనతో ఉంటున్న మహిళను చంపేశానని నానమ్మకు చెప్పగా.. ఆవిడ పోలీసులకు సమాచారం అందించింది. అత్యంత దారుణమైన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జితేంద్ర, 40 ఏళ్ల సోనియా అనే మహిళతో కలిసి జవహర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత వివాహం ద్వారా తనకు కలిగిన కుమార్తె విషయంలో ఇద్దరి మధ్య ఏప్రిల్ 21న తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన జితేంద్ర, సోనియాను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మంచం కింద దాచిపెట్టాడు.

హత్య జరిగిన తర్వాత రెండు రోజులపాటు జితేంద్ర అదే గదిలో నివసించాడు. మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు నిరంతరం అగరుబత్తులు వెలిగించాడు. అయినప్పటికీ, మృతదేహం కుళ్లిపోవడంతో దుర్వాసన తీవ్రమైంది. వాసన భరించలేని స్థాయికి చేరడంతో ఇంటికి తాళం వేసి జితేంద్ర పారిపోయాడు.

అనంతరం తన నానమ్మ వద్దకు వెళ్లి జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. విషయం తెలుసుకున్న ఆమె ఏప్రిల్ 26న పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, పరారీలో ఉన్న జితేంద్ర కోసం గాలించి, గోచ్చి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోనియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Jitendra
Sonia
Faridabad
Live-in Partner Murder
Murder Case
India Crime News
Johar Colony
Domestic Violence
Crime Investigation
Delhi NCR Crime

More Telugu News